తాండూర్‌లో అంబేద్కర్‌కు నివాళి

 

సమానత్వం కోసం అంబేద్కర్ మార్గం అనుసరించాలి: నేతలు

తాండూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి – రాజ్యాంగ రక్షణకు పిలుపు

రాజ్యాంగ విలువలపై దాడులు పెరుగుతున్నాయి: తాండూర్‌లో నేతల విమర్శలు

manasa news ప్రతినిధి, తాండూర్ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకమవ్వాల్సిన అత్యవసరం ఉందని సిపిఎం, ఎమ్మార్పీఎస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి, సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తాండూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు.చిన్న వయసులోనే కుల వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్, కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని నమ్మిన మహానేత అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించబడిందని తెలిపారు.అయితే అదే రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రజల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.ఫెడరల్ విధానం, లౌకిక ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థలను బలహీనపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా రిజర్వేషన్ల అమలు దెబ్బతింటోందని, ఇది సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తోందని అన్నారు.భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రాజ్యాంగ పరిరక్షణకై లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావడం అత్యవసరమని, అదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *