ఆశా వర్కర్ల హక్కుల కోసం సిఐటియు వినతిపత్రం
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి –
ఆశా వర్కర్లకు ₹26 వేల కనీస వేతనం ఇవ్వాలి – సిఐటియు డిమాండ్
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం
తాండూర్: manasa news ప్రతినిధి : తాండూర్ ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆశా వర్కర్ల వేతనాలు పెంచకపోగా, గత రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేసి కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ఆశా వర్కర్లకు వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించి, ప్రమాదంలో మరణించిన పక్షంలో రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.అర్హులైన ఆశా వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆశా వర్కర్ల కోసం ప్రత్యేక రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

