శుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది – కమిషనర్ మధుసూదన్ రెడ్డి
మున్సిపల్ కార్మికులను శాలువాలతో సన్మానించిన చైర్పర్సన్, కమిషనర్
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దు – పట్టణ ప్రజలకు చైర్పర్సన్ నీరజ సూచన
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 13వ వార్డులో పరిశుభ్రత కార్యక్రమం
తాండూర్, manasa news ప్రతినిధి :తాండూర్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలోని 13వ వార్డులో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ నీరజ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రోడ్లపై చెత్త వేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని ఆమె సూచించారు. అలాగే ప్రజలు వేయబడిన చెత్తను తొలగించే మున్సిపల్ కార్మికుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనేక రోగాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారా సింగ్, ఎంపీడీవో విశ్వప్రసాద్, కౌన్సిలర్ సురేష్, మేనేజర్ నరేందర్ రెడ్డి, టీపిబిఓలు ప్రియా, నరేష్, సానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, వార్డ్ ఆఫీసర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నీరజ మరియు కమిషనర్ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ కార్మికులను శాలువాలతో సన్మానించి వారి సేవలను అభినందించారు.

